“స్నేహితుడా స్నేహితుడా” (సఖి) పాట గురించి

మణిరత్నం “సఖి” సినిమా తెలుగు లిరిక్స్ చెత్తగా ఉంటాయని చాలామంది భావన. ఆ సినిమా విడుదలైన కొత్తల్లో టీవీ ఏంకర్ ఝాన్సీ ఓ ప్రోగ్రాంలో “పాటలు బాగున్నాయి, అర్థమైతే ఇంకా బాగుండేది” అని వ్యంగ్యంగా అనడం నాకు బాగా గుర్తు. “పచ్చందనమే పచ్చందనమే నీ చిరునవ్వుల పచ్చదనమే” అన్నప్పుడు “ఏం పాపం, హీరోయిన్ పళ్ళుతోముకోలేదా” అని వెటకారం చేసినవాళ్ళు ఉన్నారు. ఇక రహ్మాన్ అభిమానులైతే, “మా రహ్మాన్‌కి ఎప్పుడూ ఇదే ఖర్మ తెలుగులో” అని వాపోయి తమిళ ఆల్బంకి స్విచ్చైపోయారు.

ఈ పరిస్థితికి గీతరచయిత వేటూరిని తప్పుపట్టొచ్చు. అయితే వేటూరినే పూర్తిగా నిందించడం సరికాదనిపిస్తుంది. పాట సాహిత్యం కొన్ని చోట్ల అంతగా వినబడకపోవడానికి, పాడిన వాళ్ళకి తెలుగు తెలియకపోవడం వల్ల జరిగిన పొరబాట్లకి రహ్మాన్‌ని తప్పుపట్టొచ్చు. వేటూరి మరీ క్లిష్టమైన తెలుగు వాడకపోయినా, “మునిమాపు” లాంటి తెలుగుపదాలు కూడా అర్ధం కానంతగా దిగజారిన మన తెలుగు భాషాసామర్ధ్యానికి మనని మనం నిందించుకోవాలి!

ఈ పాటని అర్థం చేసుకునే ముందు కొన్ని విషయాలు గమనించాలి. ఇదొక శృంగార గీతం. పెద్దలకి తెలియకుండా పెళ్ళిచేసుకున్న ఓ యువజంట రహస్యంగా కలుసుకున్నప్పుడు సాగే చిన్న చిన్న ముచ్చట్లన్నీ చిలిపిగా ఆ అమ్మాయి పాడుతోంది. తమిళంలో ఈ పాట రాసినది వైరముత్తు. వైరముత్తు సాహిత్యానికి translation ఇక్కడ చదవొచ్చు. వేటూరి తమిళపాట భావాన్నే దాదాపు అనుసరించినా తనదైన సొబగులని అద్దాడు.

సాకీ:

నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ ఒళ్ళో
గాలల్లే తేలిపొతానో ఇలా డోలలూగేనో
ఆనందాల అర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమణిచెనులే నా గర్వమణిగెనులే

“మునిమాపు” అంటే సాయంసంధ్య వేళ. “డోల” అంటే “ఊయల”. “అందాల గుర్తులు” అంటే “శృంగార చిహ్నాలు” కావొచ్చు. “వలపించు” అంటే మోహింపజేయడం (fascinate).

భావం: నిన్న సాయంత్రపు వేళ మసకవెన్నెల్లో మనం కలుసుకున్నప్పుడు నా ఆనందానికి అంతులేదు. ఎంతో హాయిగా ప్రేమలో మునిగితేలాం. కానీ విడిపోవడం ఎంత బాధగా ఉంది! నీ కురుల నొక్కులో మెరిసే చుక్కలు సైతం నల్లబడ్డాయి సుమా. నీ సోయగానికి నేను దాసోహం!

భావపరంగా కొంత అస్పష్టత ఉంది. “మనం చెదిరి (నేను) విలపించా” అన్న వాక్య నిర్మాణం వేటూరిలో తరచూ కనిపించే నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది.

పల్లవి:

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా!
చిన్నచిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా!
ఇదే సకలం సర్వం, ఇదే వలపూ గెలుపు,
శ్వాస తుదివరకూ వెలిగే వేదం వాంఛలన్ని వరమైన ప్రాణబంధం

భావం: ఓ ప్రియమైన రహస్య స్నేహితుడా! నాకు కొన్ని చిన్నచిన్న సరదా కోరికలున్నాయి, నీతో తీర్చుకుంటాలే! మన ప్రేమే మన గెలుపు, అదే సమస్తం. ప్రాణసమానమైన మన బంధం వేదంలాగ కడదాకా వెలుగుతూనే ఉంటుంది.

మొత్తం పాటలో పల్లవే మెరుస్తుంది. “పల్లవికి వేటూరి” అని మరోసారి నిరూపిస్తుంది. “కోరికలే అల్లుకున్న స్నేహితుడా”, “వాంచలన్ని వరమైన ప్రాణబంధం” వంటి expressions వేటూరిలోని కవిని, అతని పదాలపొందికని చూపిస్తాయి. కథాపరంగా ప్రేమకోసం పెద్దలకి తెలియకుండా పెళ్ళిచేసుకుని, రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు కనుక – “ఇదే వలపూ గెలుపు” అనడం, “రహస్య స్నేహితుడా” అనడం పొసగుతుంది.

చరణం 1:

చిన్నచిన్న హద్దు మీర వచ్చునోయ్
ఈ జీవితాన పులకింత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా
నేను నిద్రపోతే లేతగోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి, ఆవువెన్న పూసి సేవలు శాయవలెగా
ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం!

మధువు అంటే తేనె. సందె అంటే సాయంకాలం.

భావం: ఓ ప్రియుడా! కొంచెం శ్రుతిమించి తియ్యతియ్యగా పులకింత కలిగించవోయ్. నేను నిద్రపోయినప్పుడు ప్రేమగా నా కాలిగోళ్ళు గిల్లాలి నువ్వు. ఇంకా నా అరచేతికి ఆవువెన్న రాసి నన్ను సేవించుకోవాలి మరి! ఎప్పుడైనా మనిద్దరం కన్నీరైనప్పుడు ఒకరినొకరం మృదువుగా ఓదార్చుకుందాం లే!

గాయని “పూల కొంత వెయ్యవోయ్” అని పాడింది కానీ, నాకు అది “పులకింత” అనిపిస్తుంది. “నా జీవితంలో ఆనందాన్ని నింపు” అనడానికి వేటూరి “జీవితాన పులకింత వెయ్యవోయ్” అని ప్రయోగించి ఉంటాడని నా ఊహ. “చెయ్యాలిగా” అనడానికి “శాయవలెగా” అనడం, ఎంతో లలితంగా, పాట మూడ్‌కి సరిపోయేలా ఉంది. ఈ ప్రయోగానికి “మా గురువుగారు పింగళి ప్రేరణ ఉందని” వేటూరే చెప్పారు (ఇక్కడ చూడండి).

“ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం” అనడం మొదట్లో ఎబ్బెట్టుగా అనిపించినా తర్వాత తర్వాత నాకు చాలా నచ్చింది. “ఒకరికొకరై, మన బాధలని మనసు విప్పి చెప్పుకుని  సాంత్వన పొందుదాం” అన్న అర్థం వచ్చేలా గొప్పగా రాశాడనిపిస్తుంది. ముందులైనుతో కలిపి తీసుకుంటే ఇంకో భావమూ ధ్వనిస్తుంది. ఆవువెన్న మెత్తదనాన్నీ, మృదుత్వాన్నీ సూచిస్తోంది అనుకుంటే, “వెన్నతో నిండిన వేలితో కన్నీరు తుడవడం” అంటే అందంగా, మృదువుగా, సామరస్యంగా ఒకరి కన్నీరు ఒకరు తుడుద్దాం అన్న అర్థమూ వస్తుంది.

చరణం 2:

శాంతించాలి పగలేంటి పనికే
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలేపొద్దు వలపే
ఒళ్ళెంచక్కా ఆరబోసె వయసే
నీటి చెమ్మచెక్కలైనా నాకు వరసే
ఉప్పుమూటే అమ్మైనా
ఉన్నట్టుండి ఎత్తేస్తా, ఎత్తేసి విసిరేస్తా, కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలాక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా

“చెమ్మచెక్కలు” అంటే అమ్మాయిలు ఆడుకునే ఓ ఆట. “నీటి చెమ్మచెక్కలు” అనడం వేటూరిజం. అంటే నీళ్ళల్లో ఆడుకునే సరసమైన ఆటలు అనుకోవచ్చు.

భావం: శ్రీవారూ, శాంతించాలి! పగటిపూట సరసాలు చాలించాలి! పొద్దు వాలి చీకటి పడ్డాక మనకి సొంతమైన సమయం ఉంది కదా! ఎంతైనా నా అందాల ఆరబోత తమరికేగా! నీళ్ళల్లో ఆటలకైనా నేను సై అంటాగా! మన ఉప్పుమూట ఆటల్లో నేను తమరిని ఎత్తిపడేసి, నా చీరకొంగులో దాచేస్తాను. చీకటి పడ్డాకే తమరికి విడుదల, అదీ నేనడిగిన వరాన్ని తీరిస్తేనే!

వేటూరి చిలిపిదనాన్ని ఈ చరణంలో చూడొచ్చు. “పని” అంటే వేటూరి పాటలోనే చెప్పాలంటే – “మీ పని, మీ చాటుపని, రసలీలలాడుకున్న రాజసాల పని”! (అన్నమయ్య చిత్రంలోని “అస్మదీయ మగటిమి” పాట).  “సొంతానికి తెచ్చేదింక పడకే” అనడం అందమైన తెలుగు నుడికారం. వయసు ఒంటిని ఎంచక్కా ఆరబోసింది అనడం, నీటి చెమ్మచెక్కలు నాకు వరసే అనడం ఎంత గడుసు ప్రయోగాలు! నిజానికి గాయని “ఉల్లంచొక్కా” అని పాడింది. తమిళగీతంలో కూడా “నీ చొక్కాలు నేను వేసుకుని నిన్ను అల్లరి పెడతాగా” అన్న భావం కనిపిస్తోంది. ఉల్లం అంటే “మనసు” కాబట్టి, “మనసనే చొక్కాని” నేను ఆరబోసాను అని ఒక అర్థం చెప్పుకోవచ్చు గానీ, నాకది అస్సలు సమంజసంగా అనిపించలేదు. చివరి లైనులో “వాలాక పొద్దు” అన్నది ట్యూనులో అంత సరిపడకపోవడంతో “వాలక పొద్దు” అని వినిపించి మనని అర్థం తెలియని గందరగోళంలోకి నెడుతుంది.

రెహ్మాన్ సంగీతం ఈ పాటకి గొప్పగా ఉంటుంది. “సాధనా సర్గం” కూడా బాగా పాడింది. ఈ వ్యాఖ్య వలన పాట సాహిత్యం కొంత మెరుగ్గా అర్థమయ్యి, పాటని మరింతగా ఆస్వాదిస్తారని ఆశిస్తాను.

నమ్మిన నా మది మంత్రాలయమేగా!

ఈ మధ్యే ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలోని నమ్మిన నా మదిపాట విన్నాను. అంతక ముందు చాలా సార్లు విన్నాను. విన్న ప్రతిసారీ గొప్పగా అనిపించింది. “వేటూరి ఎంత బాగా రాశాడో” అనుకోగానే వేటూరి పుట్టినరోజు  దగ్గరలోనే ఉందని గుర్తొచ్చింది. అందుకే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో ఈ వ్యాఖ్యానం.

ఈ పాట మంత్రాలయ రాఘవేంద్రస్వామిని స్తుతిస్తూ సాగినా ఒక భక్తుడు భగవంతునికి తనను తాను ఆర్తిగా నివేదించుకోవడమే నాకు కనిపిస్తుంది. అందుకే ఈ పాటని ఎవరికి వారు తమ అనుభవాలతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెయ్యబోయే వ్యాఖ్యానం కూడా ఈ కోణంలోనే సాగుతుంది.

ముందుగా పాట సాహిత్యం:

నమ్మిన నా మది మంత్రాలయమేగా

నమ్మని వారికి తాపత్రయమేగా

శ్రీగురుబోధలు అమృతమయమేగా

చల్లని చూపులు సూర్యోదయమేగా

గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా

హనుమంత శక్తిసాంద్రా

హరినామ గానగీతా

నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

చరణం : 1

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా

నీ భజనే మా బ్రతుకైపోనీవా

పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ

నీ చరణం మా శరణం కానీవా

మనసు చల్లని హిమవంతా

భవము తీర్చరా భగవంతా

మహిని దాల్చిన మహిమంతా

మరల చూపుమా హనుమంతా

నీ వీణతీగలో యోగాలే పలుకంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

చరణం : 2

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన

నీ పిలుపే మా మరుపై పోతుంటే

వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా

నీ తలపే మా తలుపే మూస్తుంటే

వెలుగు చూపరా గురునాథా

వెతలు తీర్చరా యతిరాజా

ఇహము బాపి నీ హితబోధ

పరము చూపె నీ ప్రియగాథ

నీ నామగానమే ప్రాణాలై పలుకంగా

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో

నమ్మిన నా మది మంత్రాలయమేగా

నమ్మని వారికి తాపత్రయమేగా

మొత్తం పాటలో విషయాన్ని రెండు వాక్యాల్లో గొప్పగా చెప్పారు వేటూరి. మంత్రాలయ రాఘవేంద్రస్వామిని నమ్మిన వారికి ముక్తి, నమ్మని నాస్తికులకి ఏ ప్రాప్తమూ లేదని చెప్పడం వేటూరి ఉద్దేశ్యం కాదు. ఇక్కడ నమ్మకం అంటే కేవలం belief కాదు. నీలోని అహాన్ని పక్కన పెట్టి నిన్ను నీవు సమర్పించుకోవడం. సమర్పణం అన్నది ముఖ్యమైన విషయం, ఎవరికి సమర్పించుకుంటున్నావు అన్నది కాదు. ఇది అంత సులువైనది ఏమీ కాదు. ఓ ఘడియో, ఐదు నిమిషాలో ఆ స్థితిలో ఉండగలిగితే గొప్ప విషయమే. ఆ కొద్దిసేపైనా మనసు భగవంతుని నిలయంగా,  మంత్రాలయంగా మారుతుంది.  నదిలో ఈదే చేపకి నీటి గురించి తెలుస్తుంది తప్ప ఒడ్డున కూర్చుని తర్కించే మేథావులకి కాదు. అలాగే భగవంతుడిని కేవలం కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భావించి పూజించే భక్తులకి నిజమైన భక్తిభావం అంటే తెలియదు. మన తాపత్రయంలో మనమున్నప్పుడు భగవంతుడు మన చెంతకి ఎందుకు రావాలట అసలు?

తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో 

పాటలో “తుంగాదళాల” సేవ అని తప్పుగా వినిపిస్తుంది, కానీ అది “తుంగాజలాల సేవ”. మంత్రాలయ బృందావన క్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో ఉంది కాబట్టి వేటూరి తుంగభద్రని ప్రస్తావించారు.  పాట మొత్తంలో శ్రీ రాఘవేంద్రస్వామికి సంబంధించిన ఎన్నో విశేషాలని వేటూరి ప్రస్తుతిస్తారు. వాటి గురించి బాగా తెలిసిన వారెవరైనా వ్యాఖ్యానిస్తే బాగుంటుంది.

నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా నీ భజనే మా బ్రతుకైపోనీవా

శోకంలో కూరుకుపోయిన వాళ్ళకి భగవంతుడు గుర్తుకు రావడం సహజం. అయితే నిరాశ తోడైతే మాత్రం భగవంతుడూ గుర్తుకు రాడు. నిరాశలో ఉన్న వాడికి దైవసహాయంపైన కూడా ఆసక్తి ఉండదు. అలాగే ఏదైనా కానిది/తగనిది/అనవసరమైనది పొందలానే దురాశ పుట్టినప్పుడు కూడా మన అహంలో, అహంకారంలో, అజ్ఞానంలో మనముంటాం తప్ప దేవుడు గుర్తుకు రాడు. ఈ రెండు స్థితుల్లోనూ చేజారిపోనీక మమ్ము పట్టుకు నడిపించు ప్రభూ అని వేడుకోవడం.

పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ

నీ చరణం మా శరణం కానీవా 

గుడికి వెళ్తే దేవుని పాదాలపై వాలి మొక్కుకుంటాం. పాటలు (పదాలు) పాడతాం.  తలవంచి నమస్కరించినప్పుడు కాసేపైనా మన అహంకారం తలవంచిందా? పాట పాడినప్పుడు నిమగ్నమయ్యామా లేక పొగడ్తలకోసమో, ప్రశంసల కోసమో పాకులాడేమా? అందుకే నీ చరణాలే నాకు శరణమనే శరణాగతి ప్రసాదించమని ప్రార్థన.

భవము తీర్చరా భగవంతా 

భవము అంటే పుట్టుక అని అర్థం తీసుకుంటే, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యమని వేడుకోవడం కనిపిస్తుంది. ఆశానిరాశలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలన్నీ మనసు చేసే కల్పనలే. ఇవే బంధనాలై, రుణాలై, ఇంధనాలై “రేపుని” సృష్టిస్తాయి. ఈ “కర్మ” తప్పాలంటే ద్వంద్వాలకి అతీతమైన స్థితిని పొందాల్సి ఉంటుంది. అంటే మనసు పరిధిని దాటి అనంతంలోకి దూకడం అన్నమాట. “మరుజన్మ” లేకపోవడం అంటే ఇదే!

మహిని దాల్చిన మహిమంతా

మరల చూపుమా హనుమంతా

మహిమలు చూపడంలో ఉద్దేశ్యం తన గొప్పతనాన్ని చాటుకోవడం కాదు, మనలోని అల్పత్వాన్ని తెలియపరచడం.   అందుకే నీ మహిమలన్నీ మళ్ళీ చూపి మాలోని అల్పత్వాన్ని ఎరుకజెయ్యి స్వామీ అని ప్రార్థన.

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన

నీ పిలుపే మా మరుపై పోతుంటే

వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా

నీ తలపే మా తలుపే మూస్తుంటే 

ఇక్కడ రెండు ప్రలోభాలని ప్రస్తావిస్తున్నారు. ఒకటి కాంక్ష, రెండవది వయసు. ఈ రెండూ తోడు స్నేహితులు కూడా! ఒక తీవ్రమైన వాంఛ, అది ధనం మీద కావొచ్చు, కీర్తి మీద కావొచ్చు లేక మరి దేనిమేదైనా కావొచ్చు, అది “నీలోని నిన్ను” వృద్ధి చేస్తున్నంత వరకూ అది వినాశహేతువే. అలాగే వయసూ, వేగం, శక్తీ ఉన్నప్పుడు ఆ మత్తులో మనం చేసే ప్రతీదీ గొప్పగానే కనిపిస్తుంది. ఈ రెండు స్థితుల్లోనూ వినమ్రత, ఎరుక కలిగి ఉండడం కష్టమే. అందుకే మము కాచి వెలుగు చూపమని ప్రార్థించడం. మనకి తెలిసిన ఈ “ఇహము” కొన్ని సార్లు ప్రియమైనా, కొన్ని సార్లు అప్రియమైనా మనం దాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. ఈ జంజాటం నుంచి విడిపించి పరతత్త్వాన్ని ప్రసాదించమని వినతి.

ఈ పాట నిండా పరుచుకున్న భక్తితత్త్వం మైమరపింపజేస్తుంది. మణిశర్మ చాలా చక్కటి బాణీ అందించాడు (పాటని ఇక్కడ వినొచ్చు – http://www.raaga.com/play/?id=9132). ఈ బాణీలోని శక్తి వేటూరికి గొప్ప ప్రేరణని ఇచ్చిందని చెప్పడానికి ఆయన ఈ పాటలో చేసిన శబ్దార్థ ప్రయోగాలే నిదర్శనం. లీనమైన కొద్దీ లోతు తెలిసే పాట ఇది. వేటూరి లేని లోటుని తెలిపే పాట కూడా.

చినుకులన్నీ కలిసి చిత్రకావేరి

శుభసంకల్పం చిత్రంలోని “చినుకులన్నీ కలిసి చిత్రకావేరి అన్న పాట వేటూరి కవిత్వపు లోతులని తెలిపే గొప్ప పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రే స్వయంగా మెచ్చుకున్నారు -(హాసంలోని వ్యాసం ఇక్కడ)

“చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి” అని కనురెప్పల చెలియలికట్టని దాటని కన్నీటిపొర వెనుకనున్న గుండెకడలి కల్లోలాన్ని చూపించారు”

ఓహో, గొప్ప పాటన్న మాట అనుకోవడమే తప్ప పాటలో గొప్పతనమేమిటో, ఆ మాటకొస్తే అసలు పాటకు అర్థం ఏమిటో నాకు మొదట అర్థం కాలేదు. ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు, కానీ గొప్పతనాన్ని కొంత గ్రహించాను అని చెప్పగలను. Veturi is a poet’s poet కనుక సిరివెన్నెల వంటి వారికి అర్థమైనంత నాబోటి వారికి అర్థం కాదు. ఐనా నాకర్థమైనంతలో ఈ పాట గురించి వివరిస్తాను.

సినిమాలో కథానాయకుడు (కమల్ హాసన్) ఓ జాలరి. అతనికో చక్కని భార్య (ఆమని), వారిదో ముచ్చైటైన జంట. అనుకోని పరిస్థితులలో అతని భార్య తీవ్రమైన అపాయానికి లోనై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుతుంది. కొన్నాళ్ళు మృత్యువుతో పోరాడి, తుదిశ్వాస విడుస్తుంది. అప్పుడు కథానాయకుడు, భార్య శవాన్ని పడవలో వేసుకుని, నది మధ్యకి తీసుకెళ్ళి, పడవని ఆపి భోరున విలపిస్తుండగా వచ్చే నేపథ్య గీతం ఇది. కాబట్టి ఇదొక శోక గీతం అనుకోవాలి.

అయితే సినిమా ట్రైలర్స్ చూసినప్పుడు నాకు బాగా జ్ఞాపకం – సముద్రపు ఒడ్డున కథానాయకుడు భార్యతో ఆనందంగా కనిపిస్తాడు. భార్య అతని పైన వాలి, ప్రేమగా అతని ఎద నిమురుతూ ఇదే పాట పాడుతుంది. ఈ సన్నివేశం మరి చిత్రంలో ఉందో లేదో గుర్తులేదు. అయితే వేటూరి ఈ పాటని శోకగీతంగా మాత్రమే కాక, ఇంకో అర్థం స్ఫురించేలా కూడా రాశారని అనుకోవచ్చు. అంటే ఈ పాటకి రెండు అర్థాలు ఉన్నాయన్న మాట. అదే మరి వేటూరి గొప్పతనం అంటే.

మొదటి అర్థం:

కథానాయకుడు జాలరి కాబట్టి చేపలు పట్టడానికి రోజుల తరబడి సముద్రంకేసి పోవడం సహజం. పెళ్ళాం పిల్లలని వదిలి ఇలా ఉండడం కొంత ఒంటరితనాన్ని వారిలో కలగజేస్తుందనీ, అందుకే వారు పాడుకునే పాటల్లో శృంగారం ఎక్కువ కనిపిస్తుందని యండమూరి వీరేంద్రనాథ్ ఒకచోట రాశారు. కాబట్టి సముద్రం కేసి వెళుతున్న మొగుడుని, ప్రేమగా సముదాయిస్తూ అతని భార్య ఈ పాట పాడుతోందని అనుకోవచ్చు. ఈ కోణంలో ఈ పాట అర్థాన్ని పరిశీలిద్దాం.

చినుకులన్నీ కలిసి చిత్రకావేరి

చివరికా కావేరి కడలి దేవేరి

కడలిలో వెతకొద్దు కావేరి నీరు

కడుపులో వెతకొద్ది కన్నీరు కారు

గుండెలోనే ఉంది గుట్టుగా గంగ, నీ గంగ

ఎండమావుల మీద ఎందుకా బెంగ?

రేవుతో నావమ్మ కెన్ని ఊగిసలో

నీవుతో నాకన్ని నీటి (కన్నీటి) ఊయలలు

“చిత్రకావేరి” అంటే తనే, కడలి అంటే జాలరి ఐన భర్త. నేను నీకు భార్యనయ్యాను. సముద్రంలో ఉన్నప్పుడు నన్ను గుర్తుచేసుకుని, నేను చెంత లేనని కలతపడకు. నేను నీ గుండెలోనే ఉన్నాను, నీకు తెలియదా ? (సినిమాలో కథానాయిక పేరు కూడా “గంగ”). నేను నీ చెంతనుండగా, ఏ ఎండమావులూ మన దరిజేరవు. రేవుతో నావకిమల్లే నీతో నాకు ఎన్నో నీటి ఊయల సయ్యాటలు!

రెండవ అర్థం:


ఇలా ఆనందంగా, సరస సల్లాపాలతో సాగుతున్న వారి జీవితాన్నీ, వారి అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందీ పాట. అయితే విధివశాత్తూ భార్య చనిపోతుంది. అప్పుడు కథానాయకుడు భార్య పాడిన పాటని గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అతనికి అదే పాటలో కొత్త అర్థాలు స్ఫురిస్తున్నాయి.

కావేరి చివరికి కడలిలో కలిసిపోయినట్టే, ప్రతి మనిషీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కడలిలో కలిశాక ఇంక కావేరి అంటూ ఏముంది? (కడలిని కలిసే వరకే కావేరికి రూపు ఉన్నది అన్నారు వేటూరి ఇంకో పాటలో). నేను ఒక కరిగిపోయిన జ్ఞాపకం. నన్నే తలుచుకుంటూ శోకంలో కూరుకుపోకు. ఐనా నేను ఎక్కడికీ వెళ్ళిపోలేదు, నీ గుండెలోనే సజీవంగా ఉన్నాను. రేవుతో నావకి ఉన్న బంధంలాగే, నీకూ నాకూ మధ్య ఎన్నో కన్నీటి ఊయల పాటలు.

“నీటి ఊయలలు” అని మొదట పాడి, రెండో సారి “కన్నీటి ఊయలలు” అని బాలు పాడడం వల్ల మనకి మొదటి సందర్భం కూడా గుర్తొచ్చి, భావాన్ని గుండెకి హత్తుకుపోయేలా చేస్తుంది. మొదటి సందర్భంలో ఈ పాట శైలజ పాడినట్లు గుర్తు.

ఈ పాటని వ్యాఖ్యానించడం చాలా కష్టం. పాటకి అర్థం మనలో మనమే వెతుక్కోవాలి. ఈ పాట సాహిత్యాన్ని చదివి (లేదా పాటను విని), అంతర్ముఖులమై మౌనంలోకి ఒదిగిపోగలిగితే ఎంతో కొంత అర్థమౌతుంది. “భాష ఉన్నది మనకి మౌనాన్ని పరిచయం చెయ్యడానికే” అని సీతారామశాస్త్రి గారు ఒకసారి మా మిత్రబృందంతో అన్నది ఇదే కావొచ్చు.

అసలు ఈ పాటకి ఇంత అర్థం ఏమీ లేదు, మనమే కల్పించాం అని కొందరు అనవచ్చు. సృజన అన్నది కవి హృదయంలోనే కాక, పాఠకుడి హృదయంలోనూ కలిగేలా ప్రేరేపించడమే కవిత్వం ఉద్దేశ్యం. కవి సృజనా, చదువరి సృజనా ఒకటే కానక్కరలేదు, కాలేదు కూడా. “నాలో ఉన్న నీరు నాకు కాక ఇంకెవరికి తెలుసు? అన్న ఆత్రేయ/కణ్ణదాసన్ వాక్యాలు ఇదే చెబుతాయి. నీలోని మరో నిన్ను నిదురలేపేదే కవిత్వం. అందుకే వేటూరి నిస్సందేహంగా మహాకవి.

వేటూరి పాటలో ఏముంది?

రంజని” సాహితీ సంస్థ వారు వేటూరి స్మృతిగా “పాటల పూదోట వేటూరి” అని ఒక పుస్తకం వెలువరించారు. వేటూరికి నివాళిగా రాసిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. కొన్ని వ్యాసాల్లో వేటూరి పాటలకి ఇచ్చిన వివరణలు వేటూరి జన్మదినం సందర్భంగా అందరితో పంచుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.

ఫ్రెంచి ఫిడేలు

ఒకసారి తనికెళ్ళ భరణి గారితో కలిసి నేనూ కొంతమంది మిత్రులం కార్లో రాజమండ్రి వెళుతున్నాం. వేటూరి గారి ప్రస్తావన వచ్చింది. “ఆ అంటే అమలాపురం” పాట పైకి వ్యాంప్ సాంగ్‌లా ఉన్నా లోపల ఎంతో చరిత్ర ఉందని నేనన్నాను. ఉదాహరణకి రాజమండ్రిని ప్రస్తావిస్తూ “చిత్రాంగి మేడల చీకట్ల వాడలో” అని ప్రయోగించారు వేటూరి. ఇది సారంగధ కథకు సంబంధించిన ప్రయోగం. అట్లే అదే పాటలో యానాం దగ్గర ఫ్రెంచి ఫిడేలు అనే పదం ప్రయోగించారు వేటూరి.

చారిత్రకంగా యానాం క్రీ.శ.1720లో ఫ్రెంచి వారి పాలనలోకి వెళ్ళింది కాబట్టి దాని ఆధారంగా వేటూరి “ఫ్రెంచి ఫిడేలు” అనే పదాన్ని ప్రయోగించారని నేనన్నాను. “అది కాకపోవచ్చయ్యా” అంటూ తనికెళ్ళ భరణి ఫోనందుకుని వేటూరి గారికే స్వయంగా ఫోన్ చేసి “గురువుగారూ, మీరు వాడిన ఫ్రెంచి ఫిడేలుకి అర్థమేంటి? మా వాడేదో చరిత్ర అంటున్నాడు” అని అడిగారు. భరణి గారు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారు. అటునుండి మెల్లగా మార్దవంగా ఆ పుంభావ సరస్వతి మంద్ర స్వరంతో – “ఏముంది నాయనా. మనం చిన్నప్పుడు బళ్ళో చదువుకొనేటప్పుడు జేబుల్లో చేతులు పెట్టుకుని ఇబ్బందిగా చూస్తే “ఫిడేలు వాయిస్తున్నాడ్రా” అంటూ ఉండేవారు కదా” అంటూ చల్లగా చెప్పారు వేటూరి. ఇదీ వేటూరి విశ్వరూపమంటే

ఆకెళ్ళ రాఘవేంద్ర, “గోదారమ్మ కుంకుంబొట్టు” వ్యాసం

(సారంగధ కథ ఏమిటో, ఈ ఫ్రెంచి ఫిడేలు అర్థం ఏమిటో నాకు ఇంకా తెలియలేదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పగలరు)
నవమి నాటి వెన్నెల

నవమి నాటి వెన్నెల నీవు
దశమి నాటి జాబిలి నేను
కలుసుకున్న ప్రతి రేయీ
కార్తీక పున్నమి రేయి

ఈ చిత్రంలో కథాపరంగా హీరోయిన్ జయసుధ కొత్త కుర్రాడైన హీరో కంటే పెద్దది కాబట్టి ఆమెను ముందుపుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి గూఢార్థంతో గుండెలకు అద్దారు వేటూరి.

వడ్డేపల్లి కృష్ణ, “సాటిలేని మేటి భావాల స్ఫూర్తి వేటూరి సుందరరామమూర్తి” వ్యాసం

యంగోత్రి, ఖంగోత్రి

ఒక విద్యార్థిని ప్రశ్న: మీరొక పాటలో యంగోత్రి, ఖంగోత్రి అనే కొత్త మాటలు ఉపయోగించారు. వాటిని ఎందుకు ఉపయోగించారు. వాటి అర్థం ఏమిటి?

వేటూరి: ఇవి అర్థం కాని పదాలు కావు. “యంగోత్రి” అంటే కుర్రదనీ, “ఖంగోత్రి” అంటే “కంగారుపడే యువతి” అనీ అర్థం. కొత్తపదాలు సృజించకుండా ఉంటే భాష ఎలా వృద్ధి చెందుతుంది? “మాయాబజారు”లో పింగళి గారు ఘటోత్కచుడి చేత “వెయ్యండయ్యా వీరతాడు” అనిపిస్తాడు. అలా కొత్తమాటలు పుట్టిస్తూ ఉండాలి. ఇప్పుడొస్తున్న కొత్త ట్యూన్లకి, కొత్త పద్ధతులకీ కొన్ని విన్యాసాలు తప్పనిసరి. “సావిత్రి” అనే పదం ఉందనుకోండి, ఆ పదాన్ని ఉపయోగించుకుని, “చలి సావిత్రి”, “సందిట్లో చలిసావిత్రి” అనే ప్రయోగాలు చేశాం. ఘన సంస్కృతికి సంబంధించిన నామవాచకంతో కొన్ని పదాలు కలిసినప్పుడు ఆ చమత్కారాలు నిలబడతాయి. యంగోత్రి, ఖంగోత్రి అంటే అక్కడ “త్రి” అనేది అంత్యప్రాసగా వస్తోంది. నడక కలిసిన నవరాత్రి అని వస్తుందనుకుంటాను – త్రి, త్రి అని రావడం వల్ల చమత్కారంగా ఉంటుంది కాబట్టి కొత్త పదాలు పడ్డాయి.

వేటురితో కళాశాల విద్యార్థినుల ఇంటర్వ్యూ వ్యాసం

బావరో బావర్చి

ఒకసారి నేను గురువుగారితో కలిసి హైదరాబాద్‌లో కారులో వెళ్తున్నాను. “ఇంద్ర” సినిమాకు అర్జెంటుగా పాట రాసివ్వాలి. అవతల ఒత్తిడి. ఈ ట్రాఫిక్ నుంచి బయటపడేదెప్పుడు? గురువు గారు పాట రాసేదెప్పుడు? నాకు ఒకటే టెన్షన్. నల్లకుంట నుంచి చిక్కడపల్లి మా ప్రయాణం. “తేజ గారూ (నన్ను అలాగే పిలిచేవారు), పాట ఫస్ట్ లైన్ రాసుకోండి అంటూ “అమ్మడూ అప్పచ్చీ, నువ్వంటేనే పిచ్చి” అన్నారు. నేను స్టన్ అయ్యాను. రెండో లైను చెబుతారేమోనని నేను ఆసక్తిగా చూస్తున్నాను. బావర్చీ హోటల్ దగ్గర ట్రాఫిక్ స్తంభించిపోయింది. గురువుగారు అటువైపు చూస్తూ “బావర్చి అంటే తెలుసా?” అన్నారు. “తెలియదు గురువుగారు” అన్నాను. బావర్చి అంటే వంటవాడు అన్నారాయన. ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అనుకున్నాను. అంతలోనే ఆయన – ఇప్పుడు రెండో లైను రాసుకోమంటూ “బావరో బావర్చి, వడ్డించు వార్చి” అనేశారు. నాకు నోట మాట రాలేదు. ఆ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పాట రాయడానికి ఆయన ప్రత్యేకించి సమయం తీసుకోరు. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన మనసంతా పాటై పరవళ్ళు తొక్కుతున్నప్పుడు, మళ్ళీ ప్రత్యేకించి సమయం కావాలా? అనుకున్నాను.

వేటూరి శిష్యుడు ధర్మతేజ, “దొరకునా ఇటువంటి సేవ” వ్యాసం

“ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు” అని అన్నమయ్య ఒక కీర్తనలో అన్నాడు. ఇది వేటూరికీ వర్తిస్తుంది. కొన్ని సార్లు ఆయన చాలా అల్పుడనిపిస్తాడు, అంతలోనే మహోన్నతుడనిపిస్తాడు. “గంగిగోవు పాలు గరిటెడైనా చాలు” అనుకుని ఆయన గొప్ప గీతాలని మనసుకి హత్తుకున్నప్పుడల్లా కలిగే స్పందన అనిర్వచనీయం. అందుకే ఆయన మహాకవి. ఆయనకి అంజలి ఘటిస్తూ, ఆయన్నుంచి ప్రేరణ పొందుతూ, “పాటై బ్రతుకైన పసివాడికి” వినమ్రంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.

వేటూరి – పాటసారి డైరీలోంచి 2

“సీతారామయ్యగారి మనవరాలు” తరువాత నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవలసిన స్థితిలో పడ్డాను – వేటూరి

వేటూరి రాసిన కొన్ని పాటల్లో నిజాయితీ కనిపించకపోవచ్చు, కానీ ఆయన మాటల్లో ఎప్పుడూ నిజాయితీ ధ్వనిస్తుంది. ఇలా నిజాయితీ నిండిన వ్యాసం ఇది. ఇందులో తెలుగు భాషపై వేటూరికున్న మమకారం, “సినీ తెలుగు భాష” గురించి ఆవేదనా కనిపిస్తాయ్. ఆయన తన కోసం రాసుకున్న పాటలూ, ఆత్మసంతృప్తి కలిగించిన పాటలూ కొన్ని మన మనసులని పలకరిస్తాయి. ఆయన అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా స్పందించకుండా ఉండలేము. సాహితీ అభిమానులూ, వేటూరి అభిమానులూ తప్పక చదవవలసిన ఈ చక్కని వ్యాసం ఇక్కడ – http://goo.gl/j6Uz2

పాటసారి డైరీలోంచి – 1 (ETV శ్రీ భాగవతం పాటలు)

హాసంలో వేటూరి “కొమ్మ కొమ్మకో సన్నాయి” శీర్షికన రాసిన వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్నవి ప్రచురించాను ఇప్పటి దాకా. ఇవన్నీ తర్వాత వచ్చిన “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రచురించబోతున్న మూడు వ్యాసాల ప్రత్యేకత ఏమిటంటే అవి పుస్తకంలో లేవు. కాబట్టి ఈ వ్యాసాలు బహుశా తక్కువ మంది చదివి ఉంటారు.    (Correction: ఈ రోజే సరిచూసుకున్నాను. ఈ వ్యాసం కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో ఉంది. నేను పొరబడ్డాను.)

ETV లో బాపూ రమణల భాగవతానికి వేటూరి కొన్ని పాటలు అందించారు. ఆ పాటల గురించి రాసినదీ వ్యాసం. చాలా మంచి వ్యాసం ఇది. ఎలాంటి వస్తువుకి ఎలాంటి భాష వాడాలి, తద్వారా రసపోషణ ఎలా సాధించాలి అన్నది వేటూరి వివరిస్తారు. రసపోషణ అంటే ఒక పాట విన్నప్పుడు మనలో కలిగే స్పందనగా నిర్వచించుకోవచ్చు. ఈ రసపోషణ సరిగా పాటించబడని పాటలు ఎన్నో ఉన్నాయి. నాకు గీతరచయిత చంద్రబోస్‌లో కనిపించే ప్రధానమైన లోపమే ఇది. ఆయన రాసిన కొన్ని పాటల్లో విన్నూతనంగా రాసే ప్రయత్నం వలన పాట వింటే చమత్కారం చేశాడు, కొత్తగా రాశాడు అనిపిస్తుందే తప్ప తగిన రసస్ఫూర్తి కలగదు.

శ్రీ భాగవతం పాటలు ఎక్కడైనా లభ్యమైతే తెలపగలరు. వేటూరి రాసిన వ్యాసం ఇక్కడ:  Veturi on Bhagavatam songs

అన్నమయ్య గురించి వేటూరి

అన్నమయ్య గురించి ఎక్కువగా, అన్నమయ్య చిత్రంలో తను రాసిన పాటల గురించి తక్కువగా వివరిస్తూ వేటూరి హాసంలో రాసిన వ్యాసం ఇది. ఈ చిత్రానికి వేటూరి రాసిన పాటలు మూడే – తెలుగు పదానికి జన్మదినం, ఏలే ఏలే మరదలా, అస్మదీయ మగటిమి (అప్పట్లో ఆడియో కేసెట్‌తో పాటూ ఇచ్చిన రంగుల పాటల పుస్తకంలో "ఫాలనేత్రానల" అన్న అన్నమాచార్య కీర్తన కూడా వేటూరి రచనే అని తప్పుగా పేర్కొన్నారు).

అన్నమయ్య ప్రయోగాలపై వేటూరికి ఉన్న అవగాహన వలనే "ఏలే ఏలే మరదలా" పాటని అంత సమర్థవంతంగా రాయగలిగారని ఈ వ్యాసం చదివితే అనిపిస్తుంది (ఈ పాటకి ప్రేరణ ఏదో అన్నమయ్య కీర్తన ఉన్నట్టు గుర్తు, ఏమిటో మీకు తెలిస్తే చెప్పగలరు. అలాగే "వేణువై వచ్చాను భువనానికి" అన్న పాటకి ప్రేరణ కూడా).

"అస్మదీయ మగటిమి" పాట పానకంలో పుడకని అప్పట్లో కొందరు విమర్శించారు. అసలు సినిమాలో సాళవనరసింహరాయలు పాత్రే సరిగా చిత్రించలేదని వేటూరే ఈ వ్యాసంలో – "బాక్సాఫీస్ సూత్రాలకి, అన్నమయ్య చిత్రానికి మధ్యపడి నలిగింది" అనడం ద్వారా ఒప్పుకున్నారు. ఈ పాటని సినిమానుండీ విడదీసి ఒక శృంగార గీతంగా భావిస్తే చాలా మంచి రచనే అని అనిపిస్తుంది నాకు.

ఇక తెలుగుపదానికి జన్మదినం పాట గురించి చెప్పేదేముంది?

ఈ వ్యాసాన్ని ఇక్కడ చదవండి – http://goo.gl/Pmx4w

స్వరరాగ గంగాప్రవాహమే పాట గురించి వేటూరి

వేటూరి గొప్ప పండితులనీ, సంగీత జ్ఞానం బాగా ఉన్నవారనీ తెలిసిన విషయమే. ఒక ఉదాహరణ కావాలంటే "సరిగమలు" చిత్రంలోని "స్వరరాగ గంగా ప్రవాహమే" పాట గురించి వేటూరి హాసంలో రాసిన వ్యాసం చదివితే చాలు. ఈ వ్యాసం ఇప్పటికి నేను చాలా సార్లు చదివినా, నాకు చదివిన ప్రతిసారీ కొత్త విషయం ఒకటి బోధపడడం, అర్థం కానిది కొంత మిగిలిపోవడం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రెండవ చరణానికి ఇచ్చిన వివరణ అబ్బురపరుస్తుంది.

మంచి బాణీలు ఉంటే, రచయితకి ప్రేరణా, ప్రాణం వచ్చి గొప్ప సాహిత్యం పుట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలూ మథురాలే. అన్నీ గొప్ప రచనలే. వేటూరికి 1993 తర్వాత నందీ పురస్కారాలు కానీ, మనస్విని పురస్కారాలు కానీ ఏమీ రాలేదు. చివరి రెండు దశకాల్లో ఆయన అవార్డులివ్వదగ్గ పాటలు ఎన్నో రాశారనడానికి 1994 లో వచ్చిన ఈ సినిమా ఒక ఉదాహరణ.

ఈ పాటపై వేటూరి వ్యాసం ఇక్కడ చదవండి – http://goo.gl/3R7Dt

YouTube లో ఈ పాట ఉన్న ఒక లింక్ –

గలగలగల గంగోత్రి పాట గురించి వేటూరి

గంగోత్రి సినిమాలో వేటూరి రాసిన “గలగలగల గంగోత్రి” పాటని తలచుకుంటే కొన్ని సంగతులు గుర్తుకు వస్తాయి. అప్పట్లో idlebrain.com సైట్లో శ్రేయ అన్నావిడ(?) ఆడియో రివ్యూస్ రాస్తూ ఉండేవారు. సిరివెన్నెలపై అభిమానం, వేటూరిపై దురభిమానం తనకి ఉందని చాలా పోస్టుల్లో నాకు అనిపించేది. నాకు ఈ వివక్ష నచ్చేది కాదు. అలాంటి ఆవిడే ఈ పాట గురించి – the veteran did a good job అని పొగడ్డం నాకు ఆనందాన్నిచ్చింది. హాసం రాజా ఈ పాట గురించి రాస్తూ – “వేటూరి ఈ పాటకి వాడిన భాష చూస్తే కన్నీటితో ఆయన పాదాలు కడగాలనిపిస్తుంది” అన్నారు. అప్పట్లోనే వార్త దినపత్రికలో వి.ఎ.కె రంగారావు గారు “ఆలాపన” అనే శీర్షిక నిర్వహిస్తూ ఉండేవారు. ఒక పాఠకుడు – “వేటూరి గంగని గంగోత్రని సంబోధించి తప్పులు రాశాడు” అంటే రంగారావుగారు – “అవును ఆయనకి అలవాటేగా! కలకత్తా గురించి “యమహానగరి” పాటలో తప్పులు చేసినట్టే ఇక్కడా” అని అక్కసుతో అన్నారు. పాటలో మిగతా మంచి వదిలేసి, ఏదో సినిమా సౌలభ్యం కోసం చేసిన మార్పుకి ఇంత రామాయణంలో పిడకలవేట అవసరమా అని నాకనిపిస్తుంది.ఏదేమైనా ఇది గొప్ప పాటేనని ఒప్పుకుని తీరాలి. కీరవాణి చాలా మంచి ట్యూన్ ఇచ్చారు. గమనిస్తే ఈ పాటలో ఒక పల్లవి, రెండు చరణాల standard structure లేదని తెలుస్తుంది. గంగానది లాగే ఒక free flow లో ఈ పాట దర్శనమిస్తుంది. ఈ పాట రచన గురించి వేటూరి ఏమన్నారో ఆయన మాటల్లోనే ఇక్కడ చదవండి: గలగలగల గంగోత్రి

సౌలభ్యం కోసం ఈ పాట పూర్తి సాహిత్యం కింద ఇస్తున్నాను:

సాకీ:
జీవనవాహినీ పావనీ
కలియుగమున కల్పతరువు నీడ నీవని
కనులు తుడుచు కామధేను తోడు నీవని
వరములిచ్చి భయముతీర్చి శుభముకూర్చు గంగాదేవి
నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావనీ
భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి

పల్లవి:
గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి

పసుపు కుంకుమతో
పాలు పన్నీటితో
శ్రీగంధపు  ధారతో
పంచామృతాలతో
అంగాంగం తడుపుతూ
దోషాలను కడుగుతూ
గంగోత్రికి జరుపుతున్న
అభ్యంగన స్నానం

చరణం 1:
మంచు కొండలో ఒక కొండవాగుగా
ఇల జననమొందిన విరజావాహిని
విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా
శివగిరికి చేరిన సురగంగ నీవని
అత్తింటికి సిరులనొసగు అలకనందవై
సగరకులము కాపాడిన భాగీరధివై
బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల
మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||

అమ్మా  గంగమ్మా
కృష్ణమ్మకి చెప్పమ్మా
కష్టం కలిగించొద్దని…
యమునకి చెప్పమ్మా
సాయమునకి వెనకాడొద్దని…
గోదారికి కావేరికి
ఏటికి సెలయేటికి
కురిసేటి జడివానకి
దూకే జలపాతానికి
నీ తోబుట్టువులందరికీ
చెప్పమ్మా మా గంగమ్మా

చరణం 2:
జీవనదివిగా ఒక మోక్షనిధివిగా
పండ్లుపూలుపసుపుల పారాణిరాణిగా
శివునిజటలనే తన నాట్యజతులుగా
జలకమాడు సతులకు సౌభాగ్యదాత్రిగా
గండాలను పాపాలను కడిగివేయగా
ముక్తినదిని మూడుమునకలే చాలుగా
జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని
ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ

|| గలగలగల గంగోత్రి హిమగిరిజని హరిపుత్రి ||

“పుచ్చా పువ్వుల విచ్చే తావుల” పాట గురించి వేటూరి

వేటూరి హాసం పత్రికలో “కొమ్మకొమ్మకో సన్నాయి” శీర్షికన కొన్ని వ్యాసాలు రాశారు. తర్వాత ఈ వ్యాసాలు అదే పేరుతో పుస్తకంగా వచ్చాయి (అయితే హాసంలో వేటూరి రాసిన కొన్ని వ్యాసాలు పుస్తకంలో లేవు). గంగోత్రి సినిమాలోని “గలగలగల గంగోత్రి” పాట వివరణతో మొదలుపెట్టిన వేటూరి, మరికొన్ని గీతాలనూ వివరించారు. అయితే ఓ 3-4 సంచికల తర్వాత ఎందుకో తన గీతాల గురించి ఇక రాయడం మానేసి సినీప్రముఖులపై తన అభిప్రాయాలనీ, అనుబంధాన్ని గురించి రాయసాగారు. అది జూన్ సంచికైతే ఆ నెలలో పుట్టిన ఓ ప్రముఖుని గురించి రాయడం, ఇలా సాగింది. నా వరకూ అయితే వేటూరి పాటల గురించి రాస్తేనే ఎంతో ఆసక్తిగా ఉండేది, అయినా ఏం చేస్తాం పత్రికకు సంపాదకులూ, ఎడిటర్లూ ఉంటారు కదా, వారు నిర్దేశించిన పథంలో సాగాలి మరి!

వేటూరి హాసం వ్యాసాల్లో తన పాటల గురించి రాసుకున్న వ్యాసాలని నేను స్కాన్ చేసి సినీసాహితీ అభిమానులకోసం వారం వారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. “కొమ్మకొమ్మకో సన్నాయి” పుస్తకంలో లేని కొన్ని వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వారం “మనోహరం” చిత్రంలోని “పుచ్చా పువ్వుల” అనే పాట గురించి వేటూరి రాసిన సమగ్ర వ్యాసం.

స్వయంగా వేటూరి వారే తన పాట గురించి వివరిస్తుండగా మధ్యలో నా గోల అనవసరమే. అయితే ఉబలాటం కొద్దీ కొన్ని విషయాలు పంచుకుంటాను –

  1. వేటూరి ఈ పాటని తన “గాలి పాటల్లో” ఒకటంటారు. గాలి పాటకే ఇంత ఘుమఘుమ ఉంటే మరిక ఏమనాలి? పైగా ఈ పాట బాణీ వేటూరిదే అన్నది మరో విషయం.
  2. వేటూరికి ఉన్న గొప్ప విషయపరిజ్ఞానం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. కవికి, అదీ సినిమా కవికి, కొంత ప్రతిభా, పదసంపదా ఉంటే చాలా, లేక అన్ని విషయాలపై కొంత సమగ్ర అవగాహన ఉండాలా అని ఒక ప్రశ్న. ఎక్కువ తెలుసుకుంటే ఆ తెలుసుకున్న దాన్లోనే పడి తిరగడం తప్ప సృజనాత్మకతకి పెద్ద స్థానం ఉండదని కొందరి అభిప్రాయం. ఇందులో కొంత నిజం లేకపోలేదు. అయితే దీనర్థం ఏమీ తెలుసుకోకూడదనీ కాదు. రెంటినీ బ్యాలన్స్ చెయ్యడం ఎలాగో వేటూరి వంటి వారు ఎలాగూ దారి చూపించారు.
  3. వచనంలో కూడా వేటూరి దిట్టని ఈ వ్యాసం మళ్ళీ నిరూపిస్తుంది. ప్రకృతి వర్ణన ఎంతో రమణీయంగా చేశారు.
  4. ఈ పాటని అనుభూతి చెందాలి. ఆ భావంలో నిమగ్నమవ్వాలి. పల్లెలూ, ప్రకృతి సౌందర్యాలతో అంతగా పరిచయం లేని నాబోటి వారు ఊహల్లోనే ఈ పాటని ఎంతో కొంత మరి అనుభూతి చెందాలి. అందుకే వేటూరి గర్వంగా ఈ అద్భుతచిత్రాలన్నీ దర్శించిన జన్మ నాది అని చాటుకున్నారు. అవును వేటూరి గారూ, మీరు ధన్యులు!

Google docs లో ఈ స్కాన్ చేసిన PDFని షేర్ చేస్తున్నాను – మనోహరమైన పాట . డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, ఆస్వాదించండి, మిత్రులకి పంచండి!